కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి
-కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి బీఎంఎస్ నేతల వినతి
-సింగరేణి సీఅండ్ఎండీతో మాట్లాడిన కేంద్ర మంత్రి
![](https://naandinews.com/wp-content/uploads/2022/09/IMG-20220925-WA0034-750x430.jpg)
The leaders met the Union Minister to resolve the problems of contract workers: సింగరేణిలో సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి ప్రహ్లాద్ జోషికి సింగరేణి బీఎంఎస్ నేతలు వినతిపత్రం అందించారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రిని కలిసి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సింగరేణి సీఅండ్ ఎండీ నడిమెట్ల శ్రీధర్ తో ఫోన్లో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 26వ తేదీన రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగే చర్చల్లో వారి సమస్యలు వెంటనే పరిష్కారించానలి ఆదేశాలు జారీ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని దాదాపు 17 రోజులుగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు జీవో నెం.22 వెంటనే అమలు చేయాలని, 8.33 బోనస్ కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైపవర్ కమిటీ వేతనాలు కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికుల మాదిరిగా వైద్య సదుపాయం అందించాలని కోరుతున్నారు. కరోనా సమయంలో చనిపోయిన కాంటాక్ట్ కార్మికులకు JBCCI ఒప్పందం ప్రకారం 15లక్షల రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా, గని ప్రమాదంలో చనిపోయిన కాంటాక్ట్ కార్మికులకు సైతం రూ. 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, అక్కడిక్కడే సింగరేణి సీఅండ్ఎండీతో మాట్లాడారని చెప్పారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఇనపనూరి నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ CH. మహేష్, ఏబీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు మండ రమాకాంత్, పులి రాజారెడ్డి, పెండం సత్యనారాయణ తదితరులు ఉన్నారు.