సమ్మె విర‌మించిన రేష‌న్ డీల‌ర్లు.. పంపిణీ షురూ..!

రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం

Ration dealers: రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. స‌మ్మె విర‌మించిన రేష‌న్ డీల‌ర్లు పంపిణీ ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ రోజు సచివాలయంలో రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. మంత్రి హామీ మేరకు తక్షణమే సమ్మె విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ తక్షణమే ప్రారంభిస్తున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి గంగుల 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు.

ఇప్పటికే గత సమావేశంలో మేజర్ సమస్యలపై స్పష్టతనిచ్చామని వాటి పరిష్కారంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తుందని డీలర్లకు మంత్రి గంగుల వివరించారు. కమిషన్ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీపై రేషన్ డీలర్ల జేఏసీ సంతోషం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మె విరమించి రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని కూడా ప్రకటించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు, రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు, కన్వినర్ రవీందర్, కో కన్వినర్ మల్లిఖార్జున్ గౌడ్, గౌరవాధ్యక్షులు అనంతయ్య, హైదరాబాద్ జిల్లా ప్రెసిడంట్ పుస్తె శ్రీకాంత్ ఇతర రేషన్ డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like