తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం
![](https://naandinews.com/wp-content/uploads/2021/12/Tirumala-750x430.jpg)
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వానలు.. వరదలు తిరుమలను భయపెడుతున్నాయి. అక్కడ వాన తెరిపిచ్చినా, ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుమీద పడుతున్నయి. దీంతో ఘాట్ రోడ్డు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రోడ్లు పగిలిపోతున్నాయి. తాజాగా రెండవ ఘాట్ రోడ్డు 4,5 కిలోమీటర్ల మధ్య కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు దగ్గర భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకార్ల సన్నిధికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై మొత్తం రాళ్లు ఉండడం.. కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. భక్తులతో వస్తున్న బస్సు కూడా ఉన్న సమయంలోనే కొండచరియలు విరిగిపడటంతో తృటిలో ప్రమాదం తప్పింది. జరిగిన ఘటన తెలిసిన వెంటనే టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే అధికారులను అప్రమత్తం చేసి.. అటువైపు వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీశాఖ అధికారులు కొండచరియలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. తాజా ప్రమాదం నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.