హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
![](https://naandinews.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-13-at-8.20.54-PM-750x430.jpeg)
Manchiryal: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దానికి సంబంధించిన వివరాలు మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ వెల్లడించారు. కొత్త తిమ్మాపూర్ శివారు రాళ్ల వాగులో ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి తల మెడపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ముగ్గురిని అరెస్టు చేశారు.
మృతుడితో పాటు నిందితులు మధ్య ప్రదేశ్కు చెందిన వారు. చనిపోయిన వ్యక్తి రాకేష్,మిళింద్,వికాస్,విశ్వాస్ మంచి మిత్రులు. వీరంతా కలిసి తెలంగాణలో పలు చోట్ల పనులు చేసుకునేవారు. దాదాపు ఏడాది కిందట వీరంతా కరీంనగర్లో పనిచేస్తుండగా ఇందులో రాకేశ్ బిల్డర్తో పాటు మరికొందరి దగ్గర డబ్బులని తీసుకొని అతని సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. దీంతో రాకేశ్ తీసుకున్న డబ్బులను వికాస్, మిళింద్, విశ్వాస్ లు కొన్ని రోజులు పని చేసి తీర్చేశారు. రాకేశ్ ను డబ్బుల గురించి మిళింద్ వాళ్ల నాన్న ద్వారా అడిగించాడు. దీంతో రాకేష్ అతనితో గొడవ పడి తల పగలగొట్టాడు.
తమ డబ్బులే తీసుకోవడం కాకుండా, తన తండ్రి తల పగలగొట్టడంతో రాకేష్ని ఎలాగైనా చంపాలని మిళింద్, వికాస్ నిర్ణయం తీసుకున్నారు. ఇంటి వద్దనే రాకేశ్ ని చంపితే పోలీస్ కేసులు అవుతాయి అని భయపడి, తెలంగాణ లో చంపితే ఎవరీ తెలియకుండా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. రాకేష్కు పని ఉందని చెప్పి మిలింద్ ఇక్కడకు తీసుకువచ్చాడు. అమ్మ గార్డెన్ వెనకాల రాళ్ల వాగు దగ్గరకు తీసుకువచ్చి ముగ్గురు కలిసి కట్టెలతో కొట్టి హత్య చేశారు.
దానిని ఆత్మహత్యగా నమ్మించేందుకు వారు తీసుకువచ్చిన బైక్ అతనిపై పడేసి వరంగల్ వెళ్లిపోయారు. తిరిగి పని కోసం మంచిర్యాల రావడంతో సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన పోలీసులు వారి ముగ్గురి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కత్తులు, మూడు మొబైల్ ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసు పరిష్కరించడంలో కృషి చేసిన మందమర్రి సిఐ ప్రమోద్ రావు, సర్కిల్ ఎస్ఐలు, సీసీఎస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కెకాన్ అభినందించారు.