వైకుంఠ ఏకాద‌శికి రూ. 26.61 కోట్ల ఆదాయం

తిరుమ‌ల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. 3.79 ల‌క్షల మంది భక్తుల‌కు తిరుమల స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మ‌త్స్యకార ప్రాంతాల నుంచి 6,949 మందికి ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం, రవాణా, ఆహారం, వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అలిపిరి నడక మార్గం నుంచి 26,420 మంది, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) 1.66 ల‌క్షల మంది, సర్వదర్శనం టైంస్లాట్ 83 వేల మంది, శ్రీవాణి ట్రస్టు 15,465 మంది. దాతలు 7,917 మంది వైకుంఠ ద్వార ద‌ర్శనం చేసుకున్నారు. వర్చువల్ సేవ‌లు టికెట్లు కలిగి (కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ) 43,250 మంది స్వామివారిని దర్శించారు. భక్తుల‌కు అందించిన మొత్తం 15.14 ల‌క్షల లడ్డూలు అందించినట్లు అధికారులు తెలిపారు. హుండీ కానుక‌లు ద్వారా రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు తిరుపతి నుంచి తిరుమల‌కు 6,640 ట్రిప్పుల్లో 1.81 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి. తిరుమల‌ నుంచి తిరుపతికి 6,256 ట్రిప్పుల్లో 1.84 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి. గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో భారీవర్షాల కారణంగా.. కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. రూ.1.30 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. శ్రీవారి మెట్ల మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like