వరద ఉధృతి పరిశీలించిన కోనేరు
-పెంచికలపేట్ మండలంలో ఎమ్మెల్యే కోనప్ప పర్యటన
-అప్రమమత్తంగా ఉండాలని హెచ్చరిక
![](https://naandinews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-10-at-12.12.07-PM-750x430.jpeg)
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హెచ్చరించారు. ఆదివారం ఆయన పెద్దవాగు, బొక్కవాగు వద్ద వరద ఉధృతి పరిశీలించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, స్థానిక నాయకులకు తెలిపారు. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి వస్తున్న భారీ వరద నీరు వలన ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రాణహిత తీర గ్రామాల ప్రజల విషయంలో సైతం జాగ్రత్తగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు. పెంచికలపేట్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోనప్ప ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు..