వివేక్ ప‌రిస్థితి.. దొంగే దొంగా.. దొంగా అన్న‌ట్టుంది..

Balka Suman: వివేక్ ఓటమి భయంతో దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడని, ఆయ‌న ప‌రిస్థితి దొంగే.. దొంగా, దొంగా అన్న చందంగా ఉంద‌ని మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ దుయ్య‌బ‌ట్టారు. మంచిర్యాల‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఆయ‌న‌కు ప్రజలపై నమ్మకం లేద‌ని, కేవ‌లం డ‌బ్బునే న‌మ్ముకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచ్చ‌ల‌విడిగా నాయ‌కుల‌ను కొంటున్నాడ‌ని అన్నారు. ఆయ‌న కంపెనీ అయిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ. 8 కోట్లు బదిలీ చేసింది వాస్తవం కాదా…? అని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా, మొన్న 50 లక్షలను చెన్నూరుకు తరలిస్తూ ఆధారాలతో సహా దొరికిన విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్ లను పోలీసుల అరెస్టు చేసింది వాస్తవం కాదా…? అని నిల‌దీశారు.

ఆవుల మందమీద తోడేలు గుంపు పడ్డట్టు విశాఖ ఇండస్ట్రీకి చెందిన ఉద్యోగులు, ఆయన మీడియా సంస్థలకు చెందిన ఉద్యోగులు మాపై విరుచుకుపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా డబ్బు సంచులతో, నోట్ల కట్టలతో మా లీడర్లను కొంటున్నారని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ధన రాజకీయం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు బాల్క సుమ‌న్‌. నిజంగా తప్పు చేయకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని స‌వాల్ విసిరారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో లీడర్ల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

నిన్న తండ్రి లాంటి కేసీఆర్‌పై వివేక్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని స్ప‌ష్టం చేశారు. వివేక్ కి ఓటమి భయం పట్టుకుందని అందుక‌నే ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. వివేక్‌ తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు వారి శవాన్ని గాంధీభవన్ కి కూడా తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిన విష‌యం నిజం కాదా..? అని ప్ర‌శ్నించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడమే కాకుండా ఆయన జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తున్నారని వెల్ల‌డించారు. అలాంటి గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్ నోరెలా వచ్చిందని ప్ర‌శ్నించారు.

సోషల్ మీడియాలో కేసీఆర్‌పై, నాపై అడ్డగోలుగా విమర్శిస్తున్నారన్నారు. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని, అయినా సమయంతో వ్యవహరిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వివేక్, అతని కుటుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నామ‌ని, ప్రజలు గమనించాలని బాల్క సుమ‌న్ వెల్ల‌డించారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా.. పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరారని దుయ్య‌బ‌ట్టారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమ‌ని స‌వాల్ విసిరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like