మంచి చేసినం… మ‌ళ్లీ గెలుస్తం..

ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

Balka Suman: త‌మ ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల కోసం ఎన్నో మంచి ప‌నులు చేసింద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం మంద‌మ‌ర్రిలో ప‌ర్య‌టించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో రూ. 1.50 ల‌క్ష‌ల‌తో హైమాస్ లైట్ ప్రారంభించారు. అనంతరం పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా సుమ‌న్ మాట్లాడుతూ వీలైనంత తొందరలో పని పూర్తి చేసే బాధ్యత మాదేన‌ని హామీ ఇచ్చారు. పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు కేసీఆర్ గారికి మాపై ఎప్పుడు ఉండాలి కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలన్న తెలంగాణను ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేసిన కేసీఆర్ నాయకత్వమే ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని చెప్పారు. కరోనా కష్ట కాలంలో. బీజేపీ సహకరించక పోయినా వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి మందమర్రి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

మందమరిలో మహిళా భవన్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, 24 వార్డులో బతుకమ్మ గ్రౌండ్స్, సెంట్రల్ లైటింగ్, 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అంతర్గత రోడ్లతో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేశారు. జాతీయ ర‌హ‌దారిపై ఎక్కడా లేని విధంగా పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించి 296 షాపులు కోల్పోకుండా చూశామ‌ని తెలిపారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మందమర్రి ఆర్వోబీని, 500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ. 20 కోట్లు, ముఖ్యమంత్రి ఆశీస్సులతో రూ. 25 కోట్లు మొత్తం రూ. 45 కోట్లతో మందమర్రి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామ‌న్నారు.

కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హ‌యాంలోనే సింగరేణి బొగ్గు బ్లాక్‌ల‌ను వేలం వేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. 49శాతం సింగరేణి వాటా కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ ప్రభుత్వమ‌న్నారు. సింగరేణి కార్మికులు, నాయకులు ఎన్నిదీక్షలు చేసిన కాంగ్రెస్ ఎంపీలకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అయింద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో 16 వేల యువకులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించారని వెల్ల‌డించారు. త్వరలోనే రూ. 700 కోట్ల లాభాల బోనస్, రూ. 300 కోట్ల దీపావళి బోనస్, వేజ్ బోర్డ్ ఎరియర్స్ చెల్లిస్తామ‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అని చెప్పారు.

నాలుగున్నర ఏళ్ల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల్లాగా ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తున్నారు. దయచేసి ప్రజలు ఆగం కావొద్దన్నారు. 94 సీట్లతో మన ప్రభుత్వం ఏర్పడుతుందని వెల్ల‌డించారు. పాలకవర్గం లేకున్నా మందమర్రిలో నాయకులు అద్భుతంగా పనిచేస్తున్నారని వారికి కితాబునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తమకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like