రైతులకు అండగా ఉంటాం… రానున్నది మన ప్రభుత్వమే..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
![](https://naandinews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-3.59.19-PM-750x430.jpeg)
CLP leader Bhatti Vikramarka : రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతులు, కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పెద్ద పీట వేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 వేల ఎకరాలకు సాగు నీరందించాలని గూడెం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. BRS పార్టీ అధికారంలోకి వచ్చాక నాసిరకం పనులతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ పైపులు నిత్యం పగలడం వల్ల రైతులకు కష్టాలు తప్పడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
గూడెం ఎత్తిపోతల పథకం కింద మూడు టీఎంసీల నీళ్లను రెండు మోటార్ల ద్వారా ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేసి BRS నేతలు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తరచూ మోటార్ల రిపేర్లు, పైపులు పగిలి రైతులు బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు. 13 మంది రైతుల ప్రాణానికి ముప్పు ఉన్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశానని ఆయన వెల్లడించారు. సాగునీటి కోసం రైతులు పోరాటం చేస్తుంటే బిఅర్ఎస్ పార్టీ నేతలు ఒక్కరు కూడా పట్టించుకోలేదని మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన భరోసా కల్పించారు. కెనాల్ 30, 42 కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గూడెం ప్రాజెక్టుకు కొత్త మోటర్లు, కొత్త పైప్ లైన్ వేసి సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. యాసంగి సాగుకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడతానని భట్టి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బండారి సుధాకర్, హారీఫ్, మండలాల అధ్యక్షులు అక్కలవెంకటేశ్వర్లు, తోటరవి, పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి తిరుపతి, నలిమెల రాజు, పీసీసీ సభ్యుడు కొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.