మీరూ ఆందోళన చేశారు కదా..?
![](https://naandinews.com/wp-content/uploads/2023/07/High-Court-750x430.jpg)
Telangana High Court: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమైంది…? కనీసం ఐదు వేల మందికి భద్రత కల్పించలేకపోతే ఎలా…? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. తాము నిర్వహించబోయే మహాధర్నాకు ప్రభుత్వం అనుమతించడం లేదని బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేలా బీజేపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. కానీ ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో బీజేపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతిభద్రతల కారణంగానే బీజేపీ ధర్నాకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని అడిగింది. ఐదువేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కేంద్ర మంత్రి ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని సర్కార్ను న్యాయస్థానం ప్రశ్నించింది.
చివరకు బీజేపీ మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కేవలం ధర్నా చేసుకోవాలని, ఎలాంటి ర్యాలీ చేయవద్దని ఆదేశించింది. అలాగే 500 మందితో ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. బీజేపీ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.