మీకు జ‌రిగిన అవ‌మానాలు తెలుసు..

స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసున‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ‌లో ప‌లు అంశాల‌ను పేర్కొన్నారు. జ‌డ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంటో తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక స్థానిక ప్రజాప్రతినిధులు పడిన బాధలు గుర్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు.

ఊరి కోసం అప్పు చేసి వడ్డీలు చెల్లించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్ లుగా చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం అన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టాలని వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశమని చెప్పారు. భవిష్యత్ లో స్థానిక ప్రజాప్రతినిధుల కష్టాలు తీర్చి, వారి గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు స్థానిక ప్రజాప్రతినిధులు వారి వంతు పాత్ర పోషించాలని కోరారు. పల్లెరుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందన్నారు. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like