పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం

-అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
-పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం అని రామ‌గుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక సైనికుల వీరోచిత పోరాటం మహోన్నత చరిత్ర దాగుందన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమ‌న్నారు. వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర అని స్ప‌ష్టం చేశారు. మావోయిస్టులు, అసాంఘిక శక్తులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని స్ప‌ష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని వెల్ల‌డించారు.శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామ‌ని చెప్పారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం క‌మిష‌న‌ర్‌, మంచిర్యాల కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ ఎం.శ్రీనివాస్ త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామ‌ని, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చ‌న్నారు. సంస్మరణ దినోత్సవం రోజున పోలీస్ అమరవీరుల పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. కార్యక్రమం లో ఏసీపీలు రాఘవేంద్ర రావు, ఎం. రమేష్, జి కృష్ణ ఆర్ ప్రకాష్,వెంకటేశ్వర్లు, నరసింహులు, మల్లారెడ్డి, ప్రతాప్, సుందర్ రావు, పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం , ఎఒ అశోక్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like