కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా..?
-సీఎం చెప్పినవన్నీ అబద్దాలు
-జానారెడ్డి బీసీల ద్రోహీ
-కాంగ్రెస్ పార్టీ మా బీసీలది
-దమ్కీలు ఇస్తామంటే నడవదు
-బీసీలు పండపెట్టి తొక్కుతరు
-నాకు బీఫామ్ ఇచ్చిన పార్టీని గౌరవిస్తా
-నాపై అగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయి
-కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం

Congress MLC Theenmar Mallanna: ‘నాకు నోటీసులివ్వడమేంటి..? పార్టీ ఏమన్నా మీ అయ్య జాగీరా. దమ్కీలు ఇస్తామంటే నడవద’ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల మండిపడ్డారు. ‘నాకు ఎందుకు నోటీసులు ఇవ్వాలి. పార్టీ మీ అయ్య జాగీరా.. కాంగ్రెస్ పార్టీ మాది.. బీసీల’ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటా నన్ను బెదిరించాలని.. దమ్కీలు ఇస్తామంటే నడవదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘రాహుల్ గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని పది కాలాల పాటు కాపాడాలనుకునే వారికి మాతో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన నోటీసులు తనకు ఇంకా అందలేదన్నారు. నోటీసులు వస్తే సమాధానం చెప్తానని ఆయన చెప్పుకొచ్చారు. నాకు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ ని గౌరవిస్తా. నాపై అగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయని ఆరోపించారు. కులగణన నివేదికపై బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడానికి వారి సమస్యలు వారికి ఉండవచ్చునన్నారు. అలాంటి వారిని ప్రజలే చూసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. కుల గణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పాల్సింది పోయి పారదర్శకంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం దుర్మార్గం అంటూ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ‘బీసీ ప్రజలారా, ఇది సమగ్ర కుల సర్వే కాదు. ఇది అగ్ర కుల సర్వే. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన నాటకమే ఈ సర్వే. దీనికి ఎలాంటి ప్రమాణాలు పాటించలేద’ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు.
అంబర్ పేట తులసీనగర్ కాలనీలో 20వేల మంది బీసీలు ఉంటే అక్కడ సర్వేనే జరగలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. గోల్నాకాలో, మల్కాజ్గిరిల కూడా అదే పరిస్థితి అని అందుకే ఇది ఫేక్ సర్వే అని అన్ని దొంగ లెక్కలేనని తాను బల్లగుద్ది చెప్తున్నట్లు స్పష్టం చేశారు. ‘మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే సర్వే రిపోర్టు దగ్థం చేస్తాం. కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు. జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం. ఖబడ్ధార్’అంటూ తీన్మార్ మల్లన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.‘నీవు చేసిన మోసం..కుట్రనే ఇదంతా. రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేసి 40 లక్షల బీసీలను గల్లంతు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కావాలి..టికెట్లు కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పదికాలల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేద’ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.