ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోండి..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణ విషయంలో ఎస్ఐ సుగుణాకర్పై ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తుతోంది. ఆయనపై రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి, రామగుండం కమిషనర్, మంచిర్యాల డీసీపీకి, కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేయగా, డీసీపీ, కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మంచిర్యాల జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు. తాము త్వరలో మానవహక్కుల కమిసనల్లో సైతం ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.
రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై పోలీసుల వైఖరి దారుణమన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పోలింగ్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుగుణాకర్ తమ పార్టీ కార్యకర్తలపై చాలా అసభ్యంగా ప్రవర్తించారని, అరెస్టులకు కూడా పాల్పడ్డారని తెలిపారు.
ఈ ఘటనల్లో మా పార్టీ సీనియర్ కార్యకర్తలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్రావును అరెస్టు చేయగా, మరో కార్యకర్త చక్రి అనే వ్యక్తికి గాయాలయ్యాయని స్పష్టం చేశారు. ఎస్ఐ సుగుణాకర్ అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ మా పార్టీ కార్యకర్తలను భయపెట్టి తన అధికార అధికారాన్ని చలాయిస్తున్నారని చెప్పారు. చక్రి శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయని, వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అందచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఎస్ఐ సుగుణాకర్, ప్రవర్తన, అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా కూడా వ్యవహరించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని స్పష్టం చేశారు.
ఇక, మంచిర్యాల జిల్లా నేతలు రామగుండం కమిషనర్, మంచిర్యాల DCPకి, కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రశాంత వాతావరణంతో నస్సూర్ ఏరియాకు సంబంధించిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు పెట్టిన లైన్ కి దూరంలో పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లకు వారికి సంబంధించిన పోలింగ్ వివరాలు తెలియచెబుతున్నారని వెల్లడించారు. ఓటర్లు పెద్ద మొత్తంలో మా టెంట్ వద్దకు రావడం, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు కార్యకర్తలు చాలా తక్కువ ఉండటంతో కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఓర్వలేక అలజడి సృష్టించాలనే అధికార పార్టీకి అండగా ఉన్న నస్పూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నెల్కి సుగుణాకర్ అనవసరంగా బీజేపీ సీనియర్ నేత కమలాకర్ రావుపై చెయ్యి చేసుకున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్న పోలిస్ వారి ప్రొద్బలంతో మరింత రెచ్చిపోయి బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారని స్పష్టం చేశారు. మా బీజేపీ కార్యకర్తలపై రాళ్ళు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించారని చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద వలం బీజేపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే వెళ్ళగొట్టిన ఎస్ఐ సుగుణాకర్ దెబ్బలు తిన్న కమలాకర్ రావుని అరెస్ట్ చేసి నస్పూర్ పోలిస్ స్టేషను తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11:30 నుంచి పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు కలిసికట్టుగా బూత్ కబ్జా చేసుకుని ఇష్టారాజ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ హస్తగతం చేసుకున్నారని తెలిపారు. సంఘటనపై తక్షణమే విచారణ చేపట్టి మా నాయకునిపై అకారణంగా చేయి చేసుకున్న నస్పూర్ S.I సుగుణాకర్పై చట్టపరంగా చర్యలు తీసుకోని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో S.Iని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.