శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Thirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు వారాంతం కావడంతో భక్తుల రాక పెరుగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతోంది. రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండుమూడు గంటల క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం కిటకిటలాడుతున్నాయి. వేసవికాలం మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.