మాదారం పోస్ట్మెన్పై ఫిర్యాదు
తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో పోస్టుమెన్పై మంచిర్యాల పోస్టుమాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన నిర్లక్ష్య వైఖరి వల్ల తాము నానా ఇబ్బందులు పడ్డామని తమకు పోస్టులో వచ్చిన ఏవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు మండలం నర్సాపూర్కు చెందిన పలువురు ఈ ఫిర్యాదు అందించారు. దాదాపు ఐదు సంవత్సరాలుగా పోస్టుల వస్తున్న డాక్యుమెంట్లు, పాన్కార్డులు, ఆర్సీ పుస్తకాలు, డ్రైవింగ్ లైసెన్స్లు సైతం తన వద్దనే ఉంచుకున్నాడని వారు స్పష్టం చేశారు. తాము ఎప్పుడు పోస్టాఫీసుకు వెళ్లినా తిప్పి పంపించేవాడని వెల్లడించారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు గురిచేసేవాడని అన్నారు.
వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ల కోసం దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం రావాల్సి వచ్చేది ఎప్పుడు వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపణలో పేర్కొన్నారు. ఒక్కో నెలలో నాలుగు నుంచి ఐదు సార్లు రావాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం వచ్చిన అధికారి కొన్ని లెటర్లు తీసుకువచ్చాడని అలాంటివి ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఉండొచ్చని వారు స్పష్టం చేశారు. అలాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కుర్సింగ బాబురావు, మారుతిరావు, చిన్ను, సురేష్, సాయికుమార్ ఉన్నారు.