ఘ‌నంగా సాగుతున్న మ‌హంకాళి జాత‌ర

Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు (Secunderabad Ujjaini Mahankali Bonalu) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించారు. సికింద్రాబాద్, దాని పరిసరాలలో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు పట్టు చీరలు ధరించి ఆలయానికి తరలివచ్చి, పసుపు, సింధూరంతో అలంకరించబడిన మట్టి కుండలో వండిన బియ్యం, బెల్లం కలిపిన ‘బోనం’ను సమర్పించి, వారి కోరికలు కోరుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి ‘సాకా’ను కూడా సమర్పించారు. ‘బోనం’ సమర్పించడానికి ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

సుమారు 2500 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జేబు దొంగలు, మొబైల్ ఫోన్ దొంగలపై నిఘా ఉంచడానికి మరింత మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇవాళ దర్శించుకోనున్నారు. సీఎం రానున్న దృష్ట్యా ఆలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. పండుగ సజావుగా నిర్వహించడానికి పోలీసు శాఖ 2,500 మందికి పైగా సిబ్బందిని నియమించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like