నీళ్ల దొంగలు మళ్లొస్తున్నరు..
t
BRSV State President Gellu Srinivas Yadav:కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణ వైపు చూడాలంటే భయపడేవాళ్లు.. కానీ, ప్రభుత్వం మారింది.. చంద్రబాబు కన్ను గోదావరి నది మీద పడింది.. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మన నీళ్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా- ఆసిఫాబాద్ జిల్లాల విద్యార్థి సదస్సులో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నీళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మనపై ఉన్నదన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎవరు నోరు మెదపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, కేంద్రంలో బీజేపీ తన అధికారం కాపాడుకోవడానికి చంద్రబాబు ఏది చెప్తే మోడీ అది చేస్తున్నాడని దుయ్యబట్టారు. దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందని గెల్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఈ ప్రాజెక్టుపై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలైనా కనీసం పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి పత్రాలు ఇచ్చుకుంటూ సిగ్గు లేకుండా నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్వీ తరపున మా పోరాటం ఆగదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ నిపుణులు వి.ప్రకాశ్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విజిత్ రావు పాల్గొన్నారు.