మంత్రి పదవి కోసం ఎవరి కాళ్లు మొక్కను..
Munugodu MLA Komatireddy Rajagopal Reddy:“వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, నాకంటే జూనియర్ల కు పదవులు ఇచ్చారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేద“ని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాట్లాడుతూ రాజకీయాలను అడ్డం పెట్టుకొని దోచుకోవాలని అనుకునే వారికి పదవులు కావాలి. నాకు పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలే ముఖ్యం. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. కానీ నా మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నానని ఆయన స్పష్టం చేశారు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచన. అంతేగానీ నేను వెళ్లి ఎవరినీ పదవి కోసం అడగనని వెల్లడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేది వాళ్ళ విజ్ఞత అని స్పష్టం చేశారు. తాను పదవులు అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి అభివృద్ధి సంక్షేమం కావాలి. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టమన్నారు. మునుగోడు అభివృద్ధి మాత్రం నా బాధ్యత అని మరోమారు వెల్లడించారు.
మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా. బీఆర్ఎస్ హయంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తెచ్చా. మళ్లీ రాజీనామాకైనా, ఏ త్యాగానికైనా సిద్ధం. ఎంత దూరం అయినా పోతా. మంత్రి పదవి కావాలా ? మునుగోడు ప్రజలు కావాలా ? అంటే మునుగోడు ప్రజలే కావాలని చెబుతానని అన్నారు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.