దంచికొట్టిన వాన
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలంగాణ, ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఏకంగా బుధవారం ఉదయం వరకు వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. మంచిర్యాల జిల్లా భీమినిలో 22.5, కుమ్రంబీమ్ జిల్లా రెబ్బెనలో 20.2, చిట్యాలలో 18 సెం.మీ., తాండూరులో 17.3, ములుగులో 16.4, నెన్నెలలో 14.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
వచ్చే రెండు గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షాల మూలంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా అన్నిశాఖల అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అధిక వర్షాలు, వరద ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాలకు సహాయక సిబ్బందిని ముందస్తుగా పంపించాలని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.