ముంపులో ముత్తాపూర్
Heavy Rains: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. భారీవర్షాలకు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్ నీట మునిగింది. గ్రామమంతా వరదమయంగా మారింది. ఎక్కడ చూసినా వరదనీరే. గ్రామంలోని వీధులు, రహదారులు మొత్తం నీటితో నిండిపోగా, ప్రధాన రహదారే చెరువును తలపించేలా మారిపోయింది.
ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకుపోవడంతో గోడలు కుంగిపోవడం, ఇంటి సామాను దెబ్బతినడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సరైన నాలా వ్యవస్థ, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడం వల్ల వర్షపు నీరు వీధుల్లో నిలిచిపోయింది. ఊరంతా నీటితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పత్తి పొలాలు నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. వర్షం పడిన ప్రతి సారి ఇబ్బందులు పడాల్సివస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముత్తాపూర్ గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.