ఉచితంగా ఆటోలను అందించిన బండి సంజయ్
Bandi Sanjay:మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లో 15 మంది నిరుపేద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఏ ఇంట్లో మహిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 50 లక్షల 65 వేల కోట్ల రూపాయల దేశ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టడం వల్లే ఆర్ధిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతోందన్నారు. 11వ స్థానం నుండి 4వ స్థానానికి చేరుకుంద’’ని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఒక్కో ఆటో విలువ రూ.3.5 లక్షలు. ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారు. స్టీల్ రూఫ్ తో తయారు చేసిన ఆటో డబుల్ స్పీకర్ ఎఫ్ఎం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పెట్రోల్/డీజిల్ ఆటోల ఖర్చుతో పోలిస్తే 70 నుండి 80 శాతం తక్కువ ఖర్చు ఆదా అవుతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ ఫండ్ (సీఆర్ఎఫ్) నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని నిరుపేద మహిళలకు అందజేయడం గమనార్హం. 15 మంది మహిళల్లో 10 మందికిపైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు 2 నెలలపాటు ఉచితంగా శిక్షణనివ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు అందించారు.