లక్ష కోట్లు కొట్టేయాలని చూశారు…
CM Revanth Reddy:”కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ పెద్దలు తప్పుడు పనులు చేసి లక్ష కోట్లు కొట్టేయాలని చూశారు.. ఇంజనీర్లు వద్దన్నా ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా మార్చారు.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజినీర్లు సలహా ఇచ్చినా మాజీ సీఎం కేసీఆర్ వినిపించుకోలేద”ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై ఉత్తమ్ కుమర్రెడ్డి సభలో చర్చ ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశ పుట్టిందేమో అని దుయ్యబట్టారు. 80 వేల పుస్తకాలు చదివిన మేథావికి ఈ విషయం ఎందుకు చెవినపట్టలేదని ధ్వజమెత్తారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2015లో కేంద్రం తెలంగాణకి రాసిన లేఖను ముఖ్యమంత్రి సభలో చదివి వినిపించారు. ప్రాణహిత-చేవెళ్లకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని, ప్రాజెక్ట్ కట్టుకోవచ్చని ఆనాడు ఉమా భారతి లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దురాశతో, దోపిడీకి మళ్లీ విచారణ చేయాలని కోరింది. కేంద్రం రాసిన లేఖను మళ్లీ పరిశీలించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను కోరార”ని సీఎం వివరించారు. 2009లోనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పిందని ముఖ్యమంత్రి తెలిపారు.
మంత్రి హరీశ్రావు మొత్తం వ్యవస్థలను తప్పుదోవ పట్టించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేజీ నెంబర్ 98లో పేర్కొంది. వాస్తవాలను బయటపెట్టారనే అక్కసుతో జస్టిస్ ఘోష్ కమిషన్పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా హరీశ్రావు మాట్లాడుతున్నార”ని సీఎం అన్నారు. తప్పుడు సమాచారాన్ని హరీశ్రావు పదే పదే చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని 2009, 2014లో లేఖలు రాసినా ఎందుకు వినలేదని ప్రశ్నించారు.