దాడులు సరికాదు..
-సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలి
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడకూడదని తెలిపారు. శుక్రవారం దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలలో జరిగిన ఘటనపై సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతాలలో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద గిరిజనులను వెదురు పంట సాగుకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
అటవీ ప్రాంతాలలోని గిరిజనులు అటవీ భూములలో వెదురు పంట సాగు చేసేందుకు గుంతలు తవ్వడం, మొక్కలకు నీటిని అందించడం, యూరియా ఇతర పనులకు నిధులు మంజూరు చేయడమే కాకుండా వెదురు పంటను విక్రయించుకుని ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు.