1,258 సింగరేణి బదిలీ వర్కర్లు జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ
సీఎండీ ఆదేశాల మేరకు ఉత్తర్వుల విడుదల
Singareni Badili workers regularized as general assistants:సింగరేణి (Singareni) సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 31 అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్ లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించింది.
ఈ క్రమబద్ధీకరణ విషయమై సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రుతో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ (పర్సనల్), ఐ ఆర్&పీఎం బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఏరియాల వారీగా:
రామగుండం-2 ఏరియాలో 303 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా క్రమబద్ధీకరించనున్నారు. భూపాలపల్లి ఏరియాలో 250 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 241 మంది, రామగుండం-3 & అడ్రియాల ఏరియాలలో 167 మందికి, రామగుండం-1 లో 156 మంది, మందమర్రిలో 64 మందికి, కార్పోరేట్ లో 21 మంది, కొత్తగూడెం ఏరియాలో 20 మంది, మణుగూరు ఏరియాలో 19 మంది, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది, ఇల్లందు ఏరియాలో ఆరుగురినిజనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించనున్నారు.