సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. 12 మంది మృతి
Encounter in Sukma district:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్ (CRPF) సంయుక్తంగా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. శనివారం ఉదయం బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.శనివారం ఉదయం జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.
కీలక నేత మంగడు మృతి!
ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమవ్వగా.. మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు(Mangadu, a key leader of the Maoist party) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంగడుపై ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. అతని మరణం మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఏకే-47 (AK-47) రైఫిల్స్, ఇన్సాస్ (INSAS) రైఫిల్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
గాలింపు చర్యలు ముమ్మరం
ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు అనుమానిస్తున్న బలగాలు, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా రక్తం మడుగులు ఉండటంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఇటీవలి కాలంలో మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా నిలిచింది