జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన‌లు

- లేబర్ కోడ్‌లను రద్దు చేసి , 12వ వేతన ఒప్పందం ప్రారంభించాలని డిమాండ్‌
- గేట్ మీటింగ్‌లు, జూలై 1న హెడ్ ఆఫీస్ ఎదుట భారీ ఆందోళ‌న‌
- జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య నాయ‌కుల వెల్ల‌డి

నాలుగు లేబ‌ర్ కోడ్‌ల‌ను ర‌ద్దు చేసి, JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణమే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల‌తో జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న శ్రీరాంపూర్, భూపాలపల్లిలో గేట్ మీటింగ్, జూన్ 30న కొత్త గూడెంలో గేట్ మీటింగ్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. జూలై 1న‌ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ సమావేశంలో INTUC నాయ‌కులు డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నేత‌లు వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నాయకులు రాజిరెడ్డి, రాజమౌళి, HMS నాయ‌కులు సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like