మంటల్లో చిక్కుకున్న కలలు.. 14 మంది బలి!
ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో సుమారు 14 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోక్నోఅలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధి పురానియా ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, పై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద సమయంలో అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఉన్నది. కోచింగ్ సెంటర్తో పాటు ఆ బిల్డింగ్లో ఓ పెట్ షాప్, ఇతర స్టోర్స్ ఉన్నాయి. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి కింద పడిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం పొగ, మంటలతో నిండిపోయింది. కోచింగ్ సెంటర్లో తరగతులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు బాల్కనీలు, పైకప్పుల నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. సంఘటనా స్థలంలో కేకలు, అరుపులతో భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలకు దిగారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం అగ్నిమాపక దళం, పోలీసులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటలపాటు శ్రమించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, డీజీ ఫైర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితి సమీక్షిస్తున్నారు.