సింగరేణి బంగారు బాతులా మారింది… పరిరక్షణకు ఉద్యమించండి..
Singareni:సింగరేణి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని… పన్నెండు సంవత్సరాలుగా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వాలకు “బంగారు బాతు”గా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి (Union Minister for Coal Mines Gangapuram Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ పరిరక్షణకు ఉద్యమించాలని బీఎంఎస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్కా ర్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా, దేశభక్తి భావజాలంతో పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణిలో మరింత బలపడాలన్నారు. గుర్తింపు సంఘంగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దాని కోసం బీఎంఎస్ కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి, నిబద్ధతతో సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో బీఎంఎస్ బలంగా ఉన్నచోట ఆ సంస్థలు క్రమబద్ధంగా, ఆరోగ్యకరంగా పనిచేస్తున్నాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు చెమటోడ్చి సంపాదించిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులపై బీఎంఎస్ తగిన పోరాటం చేస్తూ, సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కోల్ మినిస్ట్రీగా సింగరేణి రక్షణకు అవసరమైన సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తానని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
కార్పొరేట్ ఏరియా ఉపాధ్యక్షుడు జీవీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ABKMS నాయకులు పి. మాధవ నాయక్, పులి రాజారెడ్డి, ఎం.రమాకాంత్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వై. సారంగపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పని శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.ఎస్. పవన్ కుమార్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రామ్ సింగ్, ఏరియా ఉపాధ్యక్షులు మొగిలిపాక రవి(కొత్తగూడెం), నాయని సైదులు(ఇల్లందు), బి.కిషన్(మణుగూరు), కార్యదర్శి లీలా కృష్ణ, జేష్ట కార్యకర్తలు లట్టి జగన్మోహన్, చింతల సూర్యనారాయణ, టీవీ సూరి, చంద్రారెడ్డి, ప్రకాష్, ఉమాకర్, గురుమూర్తి, సంఘం చందర్, సింగరేణి కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షురాలు దొడ్డి నిర్మల, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.