సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటన సందర్భంగా కొడవటంచ ఆలయం, భూపాలపల్లి సభ ప్రాంగణం వద్ద మొత్తం 1100 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు పర్యవేక్షణలో భాగంగా 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొంటున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటనలో నిమగ్నమయ్యారు. పోలీసు బందోబస్తుతో పాటు, అదనంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రోప్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేస్తున్నామని. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, సూచనలు పాటించాలని ఎస్పీ సంకీర్త్ కోరారు.