రాఘవ్ చద్దా పదవి తొలగింపు
Raghav Chadha:ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) పదవి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి రాజ్యసభలో డిప్యూటీ లీడర్ గా ఉంటున్నారాయన. ఆయనను ఆ పదవి నుంచి తొలగించడమే కాకుండా, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్గా ఆ పార్టీ నియమించింది. ఈ మార్పునకు సంబంధించి అధికారిక లేఖను రాజ్యసభ సచివాలయానికి ఆప్ పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే సభలో మాట్లాడటానికి రాఘవ్ చద్దాకు సమయం కేటాయించకూడదని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
అదే సమయంలో కొన్ని నెలలుగా రాజ్యసభలో తాను లేవనెత్తిన వివిధ అంశాల్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటూ తన AAP పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవల్ ను మించి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవ్ ఛద్దాను అర్దాంతరంగా ఆ పదవినుండి తొలగించడమే కాకుండా… అతనికి రాజ్యసభలో ఎక్కువగా మాట్లాడే సమయమివద్దని కూడా AAP అధిష్టానం రాజ్యసభ సెక్రటరినీ కోరడం విశేషం.
ఈ నిర్ణయం నేపథ్యంలో పార్టీలో చీలిక ఏర్పడిందనే వదంతులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర నేతలను నిర్దోషులుగా ఢిల్లీ కోర్టు ఫిబ్రవరిలో ప్రకటించింది. రాఘవ్ చద్దా దీనిపై స్పందించలేదు. అలాగే పార్టీ కార్యాలయంలో కేజ్రీవాల్ ప్రసంగించిన సమావేశంతో పాటు జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనసభ’ వంటి కీలక పార్టీ కార్యక్రమాలకు కూడా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా చర్యతో ఆప్, ఆయన మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది.