సర్వసభ్య సమావేశం రగడ.. బీజేపీ నేతలపై కేసు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆందోళనకు దిగిన బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ తో సహా పలువురు నేతలపై కేసులు పెట్టారు. గాజుల ముఖేష్ గౌడ్, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సాత్రం రమేష్, జయ్రాం, బోరే శ్రీనివాస్, రాజ్కుమార్, బొట్ల సత్యనారాయణ, బేర సత్యనారాయణ తదితరులపై కేసు నమోదు అయ్యింది. 189(2),189(3),221,126(2),r/w 190 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనలు (రోడ్ రోకో), ప్రభుత్వ కార్యాలయాల ముట్టడులు, ప్రజాసేవకుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలకు సంబంధించి ఈ సెక్షన్లు నమోదు చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. స్థానిక అభివృద్ధి పనుల్లో తమ సలహాలను పట్టించుకోకుండా, పాలకవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు. సమావేశంలో ప్రశ్నలు అడిగినందుకు తనను మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని ముఖేశ్ గౌడ్ ఆరోపించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో పలువురు బీజేపీ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.