విద్యుత్‌ ఉచ్చు తొలగిస్తూ అటవీ శాఖ అధికారి మృతి

వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చును తొలగిస్తూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో వేటగాళ్లు అడవి జంతువుల వేట కోసం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ కరెంటు ఉచ్చుకు అటవీ శాఖ బీట్ అధికారి బానోతు నవీన్ బలయ్యారు. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో అడవి జంతువులను వేటాడేందుకు కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖకు సమాచారం అందింది. దీంతో సమాచారం అందుకున్న బీట్ అధికారి నవీన్ తోటి అటవీ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు.

అక్కడ కరెంటు ఉచ్చులను పరిశీలిస్తూ వాటిని తొలగించే క్రమంలో అనుకోకుండా విద్యుత్ షాక్‌కు గురై నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అటవీ జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చే చివరకు అటవీ శాఖ అధికారినే బలితీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

You might also like