బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం…
-జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు రాణీరుద్రమ బీజేపీలోకి
-16న కాషాయ కండువా కప్పుకోనున్న నేతలు
హైదరాబాద్ : యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. యువ తెలంగాణ పార్టీ విలీనానికి అంగీకారం తెలుపుతూ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఆయన గతంలోనూ లేఖ పంపించారు. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ సైతం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 16న యువ తెలంగాణ పార్టీ విలీనం ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం వెల్లడించారు.
ముందుగా కాంగ్రెస్లో చేరాలనే ఆలోచన చేసిన బాలకృష్ణారెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకుని బీజేపీ వైపు మొగ్గుచూపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన్ని కలవాలని జిట్టా బాలకృష్ణారెడ్డి బృందం అనుకుంది. అయితే బండి సంజయ్ అరెస్ట్, జైలుకు వెళ్లిన నేపథ్యంలో భేటీ వాయిదా పడింది. ఆ తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు నడ్డాకు లేఖ రాశారు. అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ఈ నెల 16న జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణీరుద్రమ సహా కీలక నేతలతో కాషాయ కండువా కప్పుకోనున్నారు.