మాది ఆ జాతి కాదు
ఎవరిది ఏ జాతి నో ప్రజలకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.. లక్సట్టిపేట లో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమ కారులకు తుపాకులు పెట్టిన జాతి మాది కాదు…సమైక్య వాదుల సంకన చేరి ,సంచులు మోసిన జాతి మాది కాదు….. తెలంగాణ లో రెండు జాతులే… ఒక్క ప్రేమించే జాతి మరొక్కటి వంచించే జాతి… అన్నారు. మీది ఏ జాతో ప్రజలకు తెలుసన్నారు.
ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకపోవడంతో వాటిని కాపాడుకునే క్రమంలో రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకోలేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… 32 నెలల్లో నాలుగు సార్లు రైతుబంధు నిలిపివేశారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందేదని, ఇప్పుడు యాప్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని… నిరుద్యోగ భృతి, కౌలు రైతుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కూడా తన విధానాన్ని మార్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.
పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని, అతిగా వ్యవహరించవద్దని హెచ్చరించిన కేటీఆర్… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.