“ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు”
గోదావరి నీరు కళ్ల ముందే ప్రవహిస్తున్నా… ఎల్లంపల్లికి ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, కన్నెపల్లి పంపులు కూడా ఆన్ చేయడం లేదని విమర్శించారు. “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) దుయ్యబట్టారు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు వల్ల రాష్ట్రంలో రైతులు అల్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో మాట్లాడారు.ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్… కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాల్వల వ్యవస్థ అని వివరించారు. 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగితే పెద్ద రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటిని మరమ్మతు చేయడం సాధ్యమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే కరువుకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.
రాష్ట్రానికి వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద రెండు పిల్లర్లు కుంగితే, కేవలం 400 కోట్లతో 36 నెలల్లో పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రాజకీయ కక్షతో పనులు ఆపేశారని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద 94 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నా, పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను సమన్వయంతో నడిపిస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని, కన్నెపల్లి పంపులు ఆన్ చేయవద్దని NDSA ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు.