సింగరేణిలో సమ్మె సైరన్
సింగరేణిలో కార్మిక సంఘాలు మరోమారు సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో సైతం సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించాయి. ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తూ కార్మికులు ఈ నెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే తమ సత్తా చూపిస్తామని కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నారు.