మా బావులు మావేనని..
సింగరేణిలో సార్వత్రిక సమ్మె షురూ
మంచిర్యాల : బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసిస్తూ సింగరేణివ్యాప్తంగా చేపట్టిన సమ్మె ఉదయం షిప్టు నుంచి ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో 23 భూగర్భ,19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాగా… సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉండగా, టీబీజీకేఎస్ మద్దతు ప్రకటించింది. సమ్మెలో భాగంగా బొగ్గు గనుల వద్ద కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక నేతల వెల్లడించారు.
ప్రైవేటీకరణకు నిరసనగా సమ్మె..
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ సంస్థలైన ఎల్ఐసీ, ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా, నేవీ, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలను తక్కువ ధరలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని, అందులో భాగంగా బొగ్గు పరిశ్రమను కూడా వారికే కట్టబెడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు సింగరేణి వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలోని 25 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లతో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరాయి.
పెద్ద ఎత్తున ప్రచారం..
గడిచిన పది రోజులుగా జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఇప్టూ తదితర యూనియన్లు బొగ్గు గనులపై ప్రచారం నిర్వహించి కార్మికులను సన్నద్ధం చేశాయి. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సింగరేణి వ్యాప్తంగా 43వేల మంది కార్మికులు పని చేస్తుండగా, ఎమర్జెన్సీ సిబ్బంది మినహా, బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే మెజారిటీ కార్మికులు సమ్మెలో పాల్గొనే చాన్స్ ఉంది.