ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

-శాంతి భద్రతల పరిరక్షణకే నిర్భంద‌ తనిఖీలు
-జైపూర్ ఏసిపి జీ.నరేందర్
-వెంచపల్లిలో పోలీసుల త‌నిఖీలు

Police cordon search: మంచిర్యాల జిల్లా వేంచపల్లిలో పోలీసులు నిర్భంద త‌నిఖీలు నిర్వ‌హించారు. ఏసీపీ న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ త‌నిఖీల్లో వాహన పత్రాలు సరిగా లేని 41 మోటార్ సైకిల్స్, 04 ఆటోలను, 01 ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏసీపీ నేరాల నిర్మూలన కోస‌మే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం క‌ల్పించేందుకు ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొన‌సాగుతుంద‌న్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందన్నారు.

అక్రమ వ్యాపారాలు, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కేసులు నమోదు అయి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌న్నారు. ప్రజలు,మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

గ్రామాలలో రక్షణ కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు. భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాల‌ని కోరారు. ఈ త‌నిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్ , నీల్వాయి ఎస్ఐ నరేష్ , సర్పంచ్లు రాజు బాయ్, సతీష్, ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు.

You might also like