పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. వీటికి తోడు చల్లగాలులు వీస్తుండంతో చలి తీవ్రత మరింతగా పెరిగిపోతోంది. వారం రోజులుగా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. రహదారులు కనిపించకుండా కప్పేస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరోవైపు చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు ధరిస్తున్నారు. అయినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు కాచుకుంటున్నారు.
పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని జనం భయపడుతున్నారు. ఈ యేడు అధిక వర్షపాతం నమోదు కావడంతో చలితీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
జిల్లాల వారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి 11.0
రంగారెడ్డి 11.1
కొమురంభీమ్ 11.6
ఆదిలాబాద్ 11.9
నిజామాబాద్ 12.0
మేడ్చల్ 12.1
కామారెడ్డి 12.3
మెదక్ 12.5
మంచిర్యాల 13.1
నిర్మల్ 13.6