మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే…
కేసీఆర్కు ఒక వ్యవసాయ విధానం లేదు - కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి భయం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం
మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పని ఖతం అంటున్న కేసీఆర్ హుజురాబాద్ లో బీజేపీతో కలిసి తామే ఓడగొట్టామని అనలేదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేయాలన్నారు. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. కేంద్రం వడ్లు కొనం అంటే నేను కూడా కొననని కేసీఆర్ అంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ సంస్థ కాదు కదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరినప్పుడు మరి కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదన్నారు. కేసీఆర్ కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయిండని ఎద్దేవా చేశారు. సీఎంకు అధికారం ఇచ్చింది ధర్నాలు చేయడానికా అని ప్రశ్నించారు. వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఢిల్లీలో ఇచ్చినమని, మోడీపై ఉన్న నమ్మకంతో కేసీఆర్ ధైర్యంగా ఉన్నాడని స్పష్టం చేశారు. సంజయ్ కి సవాల్ విసిరిన కేసీఆర్ మోడీకి సవాల్ విసిరే దమ్ము ఉందా అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ ల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే వారు ఎంత సంపాదించారో తెలుస్తుందని చెప్పారు. మందు పోసినోడికే మంత్రి పదవి ఇచ్చిండని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీజేపీని విమర్శించలేదు.. కేవలం బండి సంజయ్ ని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని అమిత్ షా జీహెచ్ఎంసీ, నిర్మల్ సభలో అన్నారని చెప్పారు. బండి సంజయ్ ది ఢిల్లీలో ఏం సాగదని తెలిపారు. మోడీ, షా తో తనకు ఉన్న సంబందాల వల్లే బండి సంజయ్ ఏం పీకలేడని కేసీఆర్ అంటున్నడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే కేసీఆర్కు భయమని మోడీ డైరెక్షన్లో బీజేపీని తిడుతున్నాడని చెప్పారు.
కేసీఆర్ ప్రెస్ మీట్లు నాటు సరసంలా ఉన్నాయని అన్నారు. సన్నాలు పండించమన్న సన్నాసి పండించిన తర్వాత వడ్లను కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.