కరోన యోధులు అభినవ సైనికులు

ఆప‌ద ఏదైనా… అవ‌స‌రం ఏమున్నా… నేనున్నాంటూ ముందుకు వ‌స్తాడ‌త‌ను ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా, క‌న్నీళ్లు తుడిచేందుకు ముందు వ‌రుస‌లో ఉంటాడు. పేద‌ల‌కు అన్న‌దానం ద‌గ్గ‌ర నుంచి ఆప‌ద‌లో ఉన్న వారికి ర‌క్త‌దానం వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా సేవ‌లు చేస్తున్న ఓ యువ‌కుడి ఔదార్యంపై ప్ర‌త్యేక క‌థ‌నం…

స‌మాజ సేవే ప‌ర‌మావ‌ధిగా ఓ స్వ‌చ్ఛంద సంస్థ స్థాపించి పేద‌ల కోసం, ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటూ వారి క‌న్నీళ్ల‌ను తుడుస్తున్నారు అభిన‌వ స్వ‌చ్ఛంద సేవా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు సంతోష్ కుమార్‌. ఆయ‌న త‌న సంస్థ ద్వారా ఎంతో పేద‌ల‌కు సేవ చేస్తున్నారు.. అదే స‌మ‌యంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని సైతం ఆదుకుంటున్నారు. 1996లో రెబ్బ‌న మండ‌లంలో గోలేటీలో ఫ్రెండ్స్ స్పోర్ట్ క్ల‌బ్ పేరుతో ఏర్పాటైన ఈ స్వ‌చ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌కు నిల‌యంగా మారింది. దీని ద్వారా సామాజిక సేవ కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. యువ‌కుల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ అభినవ సంస్థ‌ ద్వారా చురుకుగా పాల్గొంటున్నారు.

ఆప‌ద స‌మ‌యంలో అండ‌గా…

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆయ‌న చేస్తున్న సేవ‌ల ప‌ట్ల ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ముఖ్యంగా క‌రోనా సోకిన వారి ద‌గ్గ‌రికి బంధువులు సైతం వెళ్ల‌ని ప‌రిస్థితుల్లో వారికి సేవ‌లు చేస్తున్నారు. క‌రోనా సోకిన వారికి ముఖ్యంగా పేద వారికి మందులు, ఆహారం అందిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సైతం రెండు నెల‌ల పాటు నిత్యం అన్న‌దానం చేసి ఉదార‌త చాటుకున్నారు 102 రోజులు. 2348 కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డ‌మే కాకుండా, 3 ట‌న్నుల బ‌త్తాయిలు, 5 ట‌న్నుల కీరాదోస ఇలా అన్ని ర‌కాలుగా సేవ‌లందించారు. రెండో వేవ్ సంద‌ర్భంగా సైతం 103 రోజులుగా క‌రోనా బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. వారికి డ్రైఫూట్స్‌తో స‌హా ఓఆర్ఎస్ లిక్విడ్ జ్యుస్ పాకెట్లు, పండ్లు, మాస్కులు శానిటైజ‌ర్లు, వంటచేసుకోలేని పరిస్థితులలో ఉన్నవారికి భోజనాలు అందిస్తున్నారు. నిరుపేద కుటుంబాల‌కు, అభాగ్యులకు, వికలాంగులకు, అనాదలకు బియ్యం, నిత్యావ‌స‌ర స‌రుకులు, కూర‌గాయాలు పంపిణీ చేస్తున్నారు. ముక్యంగా గర్భిణి స్త్రీలకు , బాలాంతకు పౌష్టికాహారం, పండ్లు, గుడ్లు, ముందులు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారుకరోన పేరు చెపితే ఆమడ దూరం పోయే పరిస్థితులలో పాజిటివ్ తో ఎవరైనా మరణిస్తే దహణసంస్కారాలు చేస్తాడు. కరోనా ఆపత్కాలంలో అహర్నిశలు శ్రమిస్తూ.. ప్రజలకు తమ అమూల్యమైన సేవలు అందిస్తు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ముందున్నారు

సేవా కార్య‌క్ర‌మాల్లో నేను సైతం..

అభినవ స‌మాజ సేవా కార్య‌క్ర‌మాల్లో సైతం ముందుంటున్నారు. ముఖ్యంగా ఆప‌ద‌లో ఉన్న వారికి ర‌క్తం అందిస్తున్నారు. ఆయ‌న స్నేహితుడి త‌ల్లికి ర‌క్తం అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ర‌క్తం ఇచ్చిన సంతోష్ కుమార్… అప్ప‌టి నుంచి ర‌క్త‌దానం చేస్తూనే ఉన్నారు. ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా, ఆయ‌నే స్వ‌యంగా 74 సార్లు రికార్డు స్థాయిలో ర‌క్త‌దానం చేశారు. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించి ర‌క్తం సేక‌రించి అవ‌స‌రం ఉన్న వారికి అందించారు. ఆయన సేవ‌ల‌కు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌సారి, తెలంగాణ‌లో మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ స్వచ్చంద సేవాసంస్థ , ఉత్తమ సమాజ సేవకుడు అవార్డ్ రో5పాటు లక్ష రూపాయల రివార్డు తీసుకున్నాడు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డుల‌కు లెక్కేలేదు.

మ‌హిళా సాధికార‌త దిశ‌గా..
మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేలా త‌మ స్వ‌చ్ఛంద సంస్థ‌ను ముందుకు న‌డిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు బ్యూటీషన్ శిక్షణ , కుట్లు అల్లిక‌లు నేర్పించ‌డం వారికి కుట్టు మిష‌న్లు అందించ‌డం చేస్తున్నారు. దీంతో చాలా మంది త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో చాలా మంది స్వ‌యంగా షాపులు సైతం ఏర్పాటు చేసుకుని జీవ‌నం సాగిస్తున్నారు. అక్ష‌ర‌దీపం పేరిట దాదాపు తొమ్మిది నెల‌ల పాటు రాత్రిబ‌డులు నిర్వ‌హించి వారికి చ‌దువు నేర్పించారు. ఉచిత ఆరోగ్య శిబిరాలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు చ‌దువుకు దూరంగా ఉన్న పిల్ల‌ల‌ను బ‌డుల్లో చేర్పించ‌డం వంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ , ఉచితంగా పాలిటెక్నిక్ , వి ఆర్ ఓ , కానిస్టేబుల్ , ఎస్ ఐ , ఆర్ ఆర్ బి , ఆర్ పి ఎఫ్ , బ్యాంకింగ్ లాంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షన , ఉచిత భోజనం , ఉచిత స్టడీ మెటీరియల్స్ ఇస్తున్నారు ,ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి స్టడీ మెటీరియల్స్, నోట్బుక్స్, పెన్నులు ఉపకార వేతనాలు , పాఠశాలలకు లైబ్రరీ కోసం బుక్స్ , విద్యార్థులు బోజనాలు చేయడానికి ప్లేట్స్ త‌మవంతుగా ఇస్తున్నారు గత 12 సంవత్సరాలుగా ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేస్తూ మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీ చేస్తున్నారు, 2004 నుండి పల్స్ పోలియో శిబిరాలు ఏర్పాటు చేస్తూ పోలియో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు

ప‌ర్యావ‌ర‌ణ పట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌…

అభిన‌వ స్వ‌చ్ఛంద సంస్థ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు సంతోష్ కుమార్ ప‌ర్యావ‌ర‌ణ ప‌ట్ల కూడా త‌న బాధ్య‌త‌ను మ‌ర‌వ‌లేదు. అటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌తో పాటు త‌న వంతుగా ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.2006 నుండి ప్ర‌తి ఏటా వినాయ‌క చ‌వితికి మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను త‌యారు చేసి పంపిణీ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో మ‌ట్టి వినాయ‌కుల‌ను గ్రామాల్లో త‌యారు చేసుకునేలా అవ‌గాహ‌న సైతం క‌ల్పిస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో మ‌ట్టి వినాయ‌కుల‌నే ప్ర‌తిష్టిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొని మొక్క‌లు నాటుతున్నారు.2009 నుండి అభినవ వారి గడపకోమొక్క పేరుతో ఇంటింటికి మొక్క లు పంపిస్తూ ఇలా ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని శ్ర‌ద్ధ‌తో నిర్వ‌హిస్తూ ముందుకు సాగుతున్నరు

అభిన‌వ స్వ‌చ్ఛంద సంస్థ ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి చేయూత‌నందిస్తోంది

సాటి మ‌నిషి ఆప‌ద‌లో ఉన్నప్పుడు సాయం చేయ‌క‌పోతే మ‌నిషి జీవిత‌మే వ్య‌ర్థ‌మ‌ని తాను న‌మ్ముతాన‌ని అభిన‌వ స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు సంతోష్ కుమార్ చెబుతారు. ఆయ‌న చెప్ప‌డ‌మే కాదు.. మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా దానిని ఆచ‌రించి చూపుతున్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like