‘బండి’ కి కీల‌క ప‌ద‌వి..

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పదవి విషయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బండి సంజయ్‌తో పాటు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇటీవల బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన విష‌యం తెలిసిందే.

ఇటీవలే పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం తొలగించింది. వారికి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. శనివారం రాత్రి 10మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, బిహార్, పంజాబ్,జార్ఖండ్, రాజస్థాన్ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోమువీర్రాజు, సురేష్ కశ్యప్, సంజయ్ జైశ్వాల్, అశ్మిని శర్మ, దీపక్ ప్రకాశ్,సతీష్ పూనియా చోటుదక్కింది. ఇక చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు విష్ణుదేవ్ సాయి, ధరమ్ లాల్ కౌశిక్, కిరోడిలాల్ మీనా లకు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటుదక్కింది.

ఇటీవలే తెలంగాణ బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. మరో నేత ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.

You might also like