కాగజ్నగర్ అడవుల్లో అరుదైన పుట్టగొడుగులు…

Blue Mushroom: ప్రపంచలోనే అరుదైన జాతికి చెందిన నీలిరంగు పుట్టగొడుగులు తెలంగాణ ప్రాంతంలో కనువిందు చేస్తున్నాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అరుదైన, విలక్షణమైన ఆల్-బ్లూ మష్రూమ్ జాతి ఇటీవల అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కనపడడం ఇదే మొదటిసారి. ఇది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనిపించింది. ఇది “బ్లూ పింక్ గిల్”… “స్కై-బ్లూ మష్రూమ్”గా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం ఎంటోలోమా హోచ్స్టెట్టెరిగా గుర్తించారు.
అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖాధికారులకు జూలై 20న ఈ పుట్టగొడుగులు కనిపించాయి. 1989లో ఒడిశాలో బ్లూ పింక్గిల్ మష్రూమ్ భారతదేశంలో మొదటిసారిగా కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పటిలాగే అడవిలో తిరుగుతూ ఉండగా ఈ మష్రూమ్ కనిపించినట్లు కాగజ్నగర్ అటవీ రేంజ్ అధికారి ఎస్ వేణుగోపాల్ వెల్లడించారు. నీలం, ప్రత్యేకమైన రూపం వారిని దృష్టిని ఆకర్షించిందని ఆ చిత్రాన్ని తనకు పంపారని వేణుగోపాల్ చెప్పారు. ఇది కేవలం అద్భుతమైన రంగు మాత్రమే కాకుండా, దాని ప్రవర్తన కూడా. బ్లూ పింక్గిల్ మష్రూమ్ రాత్రిపూట మెరుస్తుందని వెల్లడించారు.
ఇలాంటి రంగు పుట్ట గొడుగులు ప్రపంచవ్యాప్తంగా కనిపించే మనోహరమైన, విభిన్నమైన పుట్టగొడుగుల సమూహమని ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బత్తుల జగదీష్ అన్నారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా చక్కెరలకు బదులుగా పోషకాలను ఉత్పత్తి చేయడం మైకోరైజల్ జాతుల ప్రత్యేకత అని వెల్లడించారు. ఈ పుట్టగొడుగుల కారణంగా చెట్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. వీటిని ఆహారంగా తీసుకోకపోవటమే మంచిదని తెలిపారు. ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్లను కలిగి ఉంటాయన్నారు. వివిధ వ్యాధుల నివారణ, మెడిసిన్ తయారీలోనూ ఇవి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ జగదీష్ తెలిపారు.
న్యూజిలాండ్ నుంచి ఉద్భవించిన ఈ జాతి పుట్ట గొడుగులకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఆ దేశపు $50 నోటు మీద ఇది కనిపిస్తుంది. ఇది ఆ దేశ జాతీయ ఫంగస్గా కూడా గుర్తించారు. ఈ పుట్టగొడుగు ఎంతో అరుదైనది.. దానిని రక్షించడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని పరిస్థితులు దాని మనుగడపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అటవీ వ్యవస్థను రక్షించడం మా మొదటి ప్రాధాన్యత, ఇవి మరిన్ని కనిపిస్తే ఈ అరుదైన జాతిని అర్థం చేసుకోవడంలో మనం లోతుగా పరిశోధించవచ్చని బత్తుల జగదీష్ వివరించారు.