మీరే మా సైన్యం…
-అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
-విస్తృతంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలి
-సోషల్ మీడియా వారియర్స్ శిక్షణ శిబిరంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Balka Suman: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు విస్తృతంగా తీసుకెళ్లాలని సోషల్ మీడియా వారియర్స్ను ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
మన రాష్ట్రంలో అందుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అందడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రైతులే వెన్నుముక అని తెలంగాణ రైతాంగం మొత్తం కేసీఆర్ వెంట నడుస్తుందనడంలో సందేహం లేదన్నారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని, ధరణి ఎత్తేస్తామని రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. 3 గంటల కాంగ్రెస్ కావాలా.. 24 గంటల బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకుల తయారవుతుందని స్పష్టం చేశారు. 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ఆరోపణలు, విష ప్రచారాలను వ్యక్తిగతంగా కాకుండా విశ్లేషణాత్మకంగా తిప్పికొట్టాలని బాల్క సుమన్ స్పష్టం చేశారు. రానున్న పది రోజుల్లో నియోజకవర్గంలో గ్రామ, మండల, మున్సిపాలిటీల వారీగా సోషల్ మీడియా కమిటీలను నియమిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వారియర్స్ ప్రణాళిక బద్ధంగా పనిచేస్తూ సోషల్ మీడియా బాధ్యతలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పనిచేయాలని కోరారు. పార్టీ డిజిటల్ మీడియా నుండి వచ్చేటటువంటి అభివృద్ధి, సంక్షేమ వివరాలను అన్ని సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా చేరవేయాలన్నారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, రెచ్చగొట్టే విధంగా దూషించవద్దన్నారు.
యువకులుగా, విద్యావంతులుగా బీఆర్ఎస్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టాలని విప్ సుమన్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వీడియోల రూపంలో, కంటెంట్ రూపంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే క్రమంలో నాయకులను, ప్రజా ప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. ఈనెల చివరి వారంలో నియోజకవర్గంలోని 5,000 మంది సోషల్ మీడియా వారియర్స్ కు శిక్షణ అందిస్తామని స్పష్టం చేశారు.