కేసీఆర్ కి కేంద్రం షాక్
బాయిల్డ్ రైస్ను తీసుకోబోమని స్పష్టం చేసిన కేంద్రం యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని వెల్లడి

తెలంగాణలో బియ్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని తెలిపింది. ఈ సీజన్ లో 60లక్షల టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొంది. గతంలో 44.7లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పామని, ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని చెప్పామని తెలిపింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంది. పంజాబ్ లో వరి వినియోగం అంతగా ఉండదని, అందుకే 90శాతం ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టత ఇచ్చింది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం.’’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రం తన విధానం స్పష్టం చేయడం గమనార్హం.