రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణలో భారీవర్షాల వల్ల జరిగిన పంటనష్టానికి పరిహారం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు 79,574 ఎకరాల పంట నష్టానికి 79,216మంది రైతుల ఖాతాలకు రూ.79.57 కోట్లు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో 79,574 ఎకరాలలో పంటనష్టం జరిగినట్లు అధికారులు నిర్ధరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 28,407 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని చెప్పారు. అలాగే మహబూబాబాద్ 14,669 ఎకరాలు, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. మిగతా 22 జిల్లాల్లో అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకూ నష్టం ఏర్పడిందని తుమ్మల పేర్కొన్నారు. పంట పరిహారం కింద ఎకరానికి రూ.10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోనే రూ.79.57కోట్లు జమ చేశారు.

You might also like