24 గంటల తర్వాత…

Commencement of cotton purchases: ఆదిలాబాద్ మార్కెట్లో ఎట్టకేలకు శనివారం ఉదయం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. వాస్తవానికి శుక్రవారం మొదటి రోజు పత్తి కొనుగోళ్లు జరపాల్సి ఉన్నా ధర, తేమ విషయంలో గొడవ జరగడంతో కొనుగోళ్లు జరగలేదు. కలెక్టర్ రాజర్షిషా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రైవేటు వ్యాపారులతో చర్చలు జరిపారు. వారు తేమ శాతం నిబంధన లేకుండా కొనుగోళ్లకు ఒప్పుకున్నారు. దీంతో క్వింటాల్కు రూ. 6,840తో శుక్రవారం నిలిచిపోయిన బండ్లను మాత్రమే శనివారం కొనుగోలు చేస్తున్నారు.
శుక్రవారం రోజుంతా ఆదిలాబాద్ మార్కెట్ లోని పత్తి కొనుగోళ్ల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. పత్తిలో తేమ 8నుండి 12% లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు మొండికేశారు. పత్తిలో తేమశాతం సగటున 17 నుండి 23% ఉండడంతో నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేది లేదని సీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. 12 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతుల్లో ఆగ్రహం పెల్లు బుకింది. రైతులు, వ్యాపారులతో ఆదిలాబాద్ కలెక్టర్ పలుదాఫాలుగా చర్చలు జరిపినా మధ్యాహ్నం 2.30 గంటల వరకు తేమ శాతం పైనే పేచీ జరిగింది. వ్యాపారులు, అధికారులు ఒక్కటై రైతులను నిండా మోసం చేస్తున్నారని పలువురు రైతులు నిలదీశారు. పంటచేతికి వచ్చేవరకు లక్షలు వెచ్చించినా మార్కెట్లో మాత్రం ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేమశాతం పరిగణనలోకి తీసుకోకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రాజార్శి షా రైతులను వ్యాపారులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ధర విషయంలో పత్తి క్వింటాలకు రూ 7,150 మాత్రమే చెల్లిస్తామని, అది కూడా 8 నుండి 12% లోపు మాత్రమే తేమ ఉండాలని చెప్పారు. ఇందుకు రైతులు అంగీకరించకపోవడంతో రాత్రి వరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
చివరకు కలెక్టర్, ఎమ్మెల్యే చొరవతో శనివారం పత్తి కొనుగోళ్లు చేసేందుకు అంగీకారం తెలిపారు. వారు తేమశాతం నిబంధన లేకుండా కొనుగోళ్లకు ఒప్పుకున్నారు. దీంతో క్వింటాల్కు రూ. 6,840తో శుక్రవారం నిలిచిపోయిన బండ్లను మాత్రమే శనివారం కొనుగోలు చేస్తున్నారు. అయితే, మళ్లీ మార్కెట్కు వచ్చే బండ్ల విషయం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.