ఉత్పత్తితోనే సింగరేణి మనుగడ

Singareni: అనుకున్న లక్ష్యాలను చేరుకుని సింగరేణి మనుగడకు సహకరించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులను, ఓపెన్కాస్టులను సందర్శించి కార్మికులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది లక్ష్యాలను సాధించాలంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కలిపి రోజుకు కనీసం 2 లక్షల 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులపైనే సంస్థ మనుగడ ఆధారపడి ఉందన్నారు. అనుకున్న ఉత్పత్తి సాధిస్తేనే సంస్థ మనుగడ ఉంటుందన్న విషయాన్ని కార్మికులు గుర్తించాలని స్పష్టం చేశారు.
ఉత్పత్తి లక్ష్యం చేరుకోవాలంటే తగిన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి ఏరియాలో ఇప్పటివరకు వెనుకబడి ఉన్న ఉత్పత్తితోపాటు ప్రతి నెలకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు కూడా సాధించాలని, దీనికోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలన్నారు. ప్రతి గనికి రోజువారి లక్ష్యాలు నిర్దేశించుకుని బొగ్గు ఉత్పత్తి సాధించాలని, దీనికోసం యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గైర్హాజరు పూర్తిగా తగ్గించాలని పూర్తిస్థాయిలో మానవ వనరులు, యంత్ర వినియోగం జరగాలని కోరారు. రక్షణతో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు.