51 కోట్లు దాటిన భక్తుల పుణ్యస్నానాలు

Maha Kumbh 2025: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాకు జనం అంచనాకు మించి హాజరవుతున్నారు. భక్తుల సంఖ్య 51 కోట్లు దాటింది. శనివారం మధ్యాహ్నం నాటికే, ఈ సంఖ్య 51 కోట్లకు చేరుకుందని అధికారులు ప్రకటించారు. వారాంతం కావడంతో శనివారం రోజే 1 కోటి మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేశారు. కుంభమేళా ముగింపు దశకు చేరుకోవడం కూడా భక్తుల ప్రవాహానికి దారి తీస్తోందని పలువురు అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి ఈ మహా కుంభమేళాకు దేశావిదేశాల నుండి 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంతకు మించి భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాలో భక్తుల సంఖ్య 51 కోట్ల మార్కును దాటిందని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. మహా కుంభ్ ప్రాంతం నుండి నగరానికి వెళ్ళే అన్ని రోడ్లు, దారులు భక్తుల రద్దీతో నిండి ఉన్నాయి. భారీ జనసమూహం కారణంగా, మహా కుంభ్ ప్రాంతాన్ని రెండు రోజుల పాటు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ కూడా ఫిబ్రవరి 16 వరకు మూసివేశారు.